షష్టి పూర్తి వేడుక
Shashtipurthi Cermony
Telugu Traditional Event : Shashtipurthi Cermony –
‘జన్యతషష్టమే వర్ణే మృత్యురుగ్రరథా నృణాం | దశభిస్త్వధికే తస్మిన్ మృత్యుర్భీమథోనృణాం | విజయాఖ్యరథోమృత్యుః అష్టసప్తతిమే భవతే 1-(శాంతి కమలాకరం)
మానవునికి 59 సంవత్సరాలు దాటి 60వ సంవత్సరంలో ప్రవేశించ గానే ‘ఉగ్రరథ‘ అనే మృత్యువు మనను వెంటాడుతుంది. అందువల్ల 60 సంవత్సరములు నిండిన వెంటనే ‘ఉగ్రరథ శాంతి‘ కార్యక్రమం జరిపి షష్ఠిపూర్తి చేయాలి. అదేవిధంగా 70 సంవత్సరాలు నిండితే ‘భీమరథ‘ అనే మృత్యుదోషం కలుగుతుంది. కాబట్టి ‘భీమరథశాంతి‘ చేయాలి.
అలాగే 78 సంవత్సరములు నిండితే ‘విజయరథశాంతి‘ చేయాలి. పుట్టినప్పటినుండి 83 సంవత్సరాల 4 మాసాలకు వేయి చంద్రదర్శనాలు పూర్తవుతాయి. కాబట్టి అప్పుడు ‘సహస్ర చంద్రపూర్ణ దర్శనం‘ చేయాలి. నూరు సంవత్సరాలు పూర్తిగా నిండితే ‘పూర్ణ శతాభిషేకం‘ నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
60 సంవత్సరాలు నిండిన తరువాత ఈ వేడుక జరుపుకొందురు. ఆనాటి ఉదయాన భార్యాభర్తలిద్దరూ తలస్నానం చేసి, తల్లిదండ్రులు ఉంటే వారిని కుర్చీలో కూర్చుండబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి, కాళ్ళకు నమస్కారము చేసి వారికి అక్షింతలు ఇచ్చి వారి ఆశీర్వాదములు తీసుకొన వలెను. తరువాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పూజ అభిషేకము చేయించు కొనవలెను. అవకాశమున్నచో ఆ సంవత్సరము మొత్తము గోత్ర నామములతో పూజ చేయించుకొనుట చాలా మంచిది.
స్తోమత కల్గిన వారు ఈ వేడుకను ఇంకా గొప్పగా చేసుకొంటారు. అలా చేసుకోవాలనుకున్న వారు ముందుగా బ్రాహ్మణులను సంప్రదించి వారు సూచించిన విధంగా ఈ వేడుక జరిపించుకోవాలి.