Telugu Marriage Tradition : Mangalya Dharana –
మన హిందూ సంప్రదాయంలో మాంగళ్య ధారణ అనేది ముఖ్యమైన ఘట్టం. వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు “మంగళ సూత్రం” ధరించడం భారతీయ సంప్రదాయం–హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంసృతంలో ‘మంగళ‘ అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు.
రెండు పళ్లెములతో తెచ్చిన తలంబ్రాలపై మంగల సూత్రములుంచి వరుడు మాంగల్య దేవతను ఆహ్వానించి షోడశోపచారములతో మంగళ సూత్రమును పూజిస్తాడు. పెండ్లికి విచ్చేసిన బంధువులచే ముత్తైదువులచే మాంగళ్యాన్ని స్పృశింపఁజేసి, తరువాత వరుడు వధువునకు ఎదురుగా నిలబడి వధువు యొక్క మెడలో ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ (మంగళ సూత్రధారణ) మూడు ముళ్ళు వేస్తాడు.
“మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా,
కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశ్శతమ్”
ఓ వధువా! నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగల్యము అను ఈ బంధమును కట్టుచున్నాను. నా జీవితానికి, జీవన గమనానికి హేతువైన మంగళసూత్రాన్ని ధరించి నూరు సంవత్సరాల వరకు జీవించి ఇచ్చటనే ఉండాలని ఆకాంక్షించుచున్నాను. అని వరుడు మంగళ సూత్రధారణ చేస్తాడు. వివాహ బంధానికి చిహ్నం ఈ మంగళసూత్రం. మంగళ సూత్రానికి రెండు బంగారు బిళ్లలు వుండి, అవి హృదయ స్థానంలో వ్రేలాడుతూ వుంటాయి. హృదయ స్థానంలో జీవాత్మ పరమాత్మలని రెండు వుంటాయి. ఆ జీవాత్మ పరమాత్మలను తెలియజేయడానికి యీ మంగళ సూత్రాలు ఒక సంకేతం అని అర్థం.
సమస్త శుభాలకు, మంగళ ప్రథమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే “శత మానములు” అని కూడా అంటారు.
బంగారంతో చేయబడ్డాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం.
వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించు తారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ–రజ–తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-“ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు” అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించు తారు. “శతమానం భవతి, శతాయుః పురుష !” అనే మంత్రాన్ని చదువు తారు. అందుకే, వీటికి “శత మానములు” అని పేరొచ్చింది. తరువాత వివాహ మండపంలోని సభ్యులు అక్షతలను వధూవరుల శిరస్సులపై ఉంచుచూ ఓం సౌభాగ్యమస్తు అని వధువును ఆశీర్వదింస్తారు. ఓం శుభం భవతు అని వరుని ఆశీర్వదిస్తారు. స్త్రీకి పుట్టిల్లు–అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, ధర్మ మోక్షాలుఅర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు–సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.