రొట్టెల పండుగ , నెల్లూరు
Bread Festival, Nellore
Telugu Traditional Event : Bread Festival, Nellore –
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గా వద్ద జరిగే వార్షిక కార్యక్రమాన్ని 12 మంది అమరవీరుల పండుగగా పాటిస్తారు.
రొట్టెల పండుగ ఎలా మొదలైంది?
ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్ప కుండా జరుగుతూ, స్థానిక పత్రికలలో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.
రొట్టెలను ఎలా సమర్పిస్తారు?
ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు రొట్టెలు చెరువులోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు. ఆరోగ్యం గురించి మొక్కు కొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు. ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె. ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు. ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.
గంధమహోత్సవం
మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్న భక్తులు జిల్లాలోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. చెరువు వద్ద వున్న బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం జరుగుతుంది.
రొట్టెల పండుగను ప్రారంభించిన ఆర్కాటు నవాబు
ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు.
రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీన్లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటి పై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే భార్యభర్తలిద్దరు గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు సరైన వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో వున్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అను చరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది.
దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారా షహీదులకు ప్రార్థనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తున్నది. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. తరువాత జనం రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఈ ఉత్సవాన్ని నాలుగు రోజులు జరుపుతున్నారు.