భోగిపండ్లు
Bhogi Pallu ( Sankranthi Festival )
Telugu Tradition : Bhogi Pallu – సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది.
అరిష్టాలు, దిష్టివంటివి దరిచేరవు
భోగి పండుగ సాయంత్రం సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలపై భోగి పండ్లను పోస్తారు. దీనివలన ఐదేళ్లలోపు పిల్లలపై ఉండే అరిష్టాలు, దిష్టి వంటివి తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు రేగి పండ్లు సహకరిస్తాయని ఒక నమ్మకం.
ఐదేళ్ల వయసులో చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుందని, రేఖ అరా కూడా పలుచగా ఉంటుందట. అయితే రేగిపండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాసన పిల్లల తలపైన బ్రహ్మ రంధ్రానికి శక్తి ఇస్తుందని, మేధస్సుకు శక్తి చేకూరుతుందని పెద్దల నమ్మకం.
ముందుగా శ్రీకృష్ణునికి హారతి
పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి హారతి పడతారు. ముందుగా శ్రీకృష్ణునికి హరతి అద్దిన తరువాత పిల్లలకు అద్దుతారు. ముందుగా శ్రీకృష్ణునికి భోగిపండ్లు పోసిన తరువాతనే పిల్లలకు మూడుసార్లు కొద్దికొద్దిగా పోస్తారు. ఈ విధంగా అందరూ పోయవచ్చును. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు దక్షిణ తాంబూలాలు అందిస్తారు.
భోగిపండ్లు ఎలా కలుపుతారు?
చిల్లర, నానబెట్టిన శనగలు, బంతిపూల రేకులు, రేగిపండ్లు వీటన్నిటినీ కలుపుకోవాలి. సంక్రాంతి నాడు పోసిన భోగిపండ్లను పండుగ పండ్లు అంటారు.
భోగిపండ్లు పోయటంలోని అంతరార్థం
విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి‘ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి‘ అవుతారన్నది ఒక విశ్వాసం.
నారాయణుని ఆశీస్సులు
రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపిం చారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణు డిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
సూర్యుని ఆశీస్సులు
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. సూర్యుడి రంగులో ఉండే రేగిపండ్లను చిన్నపిల్లలపై పోస్తే సూర్యుడు ఆశీస్సులు దొరుకుతాయని ఒక నమ్మకం. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.